Clock Of Nellore ( Nellore ) – రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే తన ప్రజారంజక పాలన ద్వారా ప్రజలు ప్రతీ రోజూ సంతోషంగా జీవించేలా పరిపాలిస్తారని, అవినీతి ఆస్కారం లేకుండా ప్రజలే పరమావధిగా ఉంటారని జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి అన్నారు. వినాయక చవితి పండుగ రోజు కూడా ఆయన విరామం తీసుకోకుండా నెల్లూరు 13వ డివిజన్ లో పవనన్న ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. 107వ రోజైన ఇవాళ బ్యాంకు కాలనీ 2వ వీధిలో పర్యటించి గడప గడపకూ వెళ్లి ప్రజలను పలకరించారు. సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అక్కడి వారికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా వారితో కలిసి పండుగను జరుపుకున్నారు. అనంతరం వినోద్ రెడ్డి మాట్లాడుతూ వైసీపి ప్రభుత్వంలో ఏ వర్గం ప్రజలు కూడా సంతోషంగా లేరని అన్నారు. పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిని చేసుకుంటే ప్రతీ రోజూ పండుగ దినంలా ఉండేలా పరిపాలిస్తారని హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.
