Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నగరం, శివార్లలో కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఓవర్ బ్రిడ్జి లను నిర్మించాలని యోచిస్తోందని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి బుధవారం పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దానికోసం ఎంత మొత్తాన్ని కేటాయించారని కూడా అడిగారు. దీనికి కేంద్ర రైల్వే సమాచార శాఖ మంత్రి అశ్వినివైష్ణవ్ రాతపూర్వకంగా సమాధానం చెబుతూ నెల్లూరు నగరంలో నాలుగు లెవెల్ క్రాసింగ్ లు 112, 113, 117, 118 ఉన్నాయని తెలిపారు. ఇందులో 112, 113 బదులుగా 2 ఓవర్ బ్రిడ్జి లు భాగ స్వామ్య ప్రాతిపదికన నిర్మించేందుకు 47.11కోట్లు, 46.36 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. 117, 118 లెవెల్ క్రాసింగ్ లు నెల్లూరు రైల్వే స్టేషన్ యార్డు లో ఉన్నాయని, ఇక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జి, అండర్ బ్రిడ్జిల నిర్మాణానికి భాగస్వామ్య ప్రాతిపదికన అర్హత పొందాయని తెలిపారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంతవరకూ ఎటువంటి ప్రతిపాదన అందలేదని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో 55 లెవెల్ క్రాసింగ్లు(ఎల్.సి) అందుబాటులో ఉంటే అందులో 15 ఎల్.సి ల వద్ద రోడ్డు ఓవర్ బ్రిడ్జిలు, రోడ్ అండర్ బ్రిడ్జి లు మంజూరైనట్లు తెలిపారు.