Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు జిల్లాలో నాడు – నేడు రెండో విడత అభివృద్ధి పనులు ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని, ఎంపీడీవోలు, ఎంఈఓలు, ఆయా శాఖల ఇంజనీరింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో పనుల పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ అధికారులను ఆదేశించారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో నాడు నేడు రెండో విడత పనుల పురోగతిపై ఎంపీడీవోలు, ఎంఈఓ లు, ఇంజనీరింగ్ అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న రెండు నెలల పాటు చేపట్టనున్న పనులకు సంబంధించి ఒక ప్రణాళికను రూపొందించుకొని, ఆ ప్రకారం అన్ని పాఠశాలల్లో నాడు నేడు పనులను చేపట్టాలన్నారు. ఆయా గ్రామాల్లోని ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రతివారం ఎంపీడీవోలు, ఎంఈఓ లు పనుల పురోగతిని సమీక్షించాలన్నారు. ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు పూర్తి బాధ్యత వహించి పనులు పర్యవేక్షించాలన్నారు. ప్రతిరోజు పని జరుగుతున్న పాఠశాలలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. మేస్త్రీలు, కూలీలు అవసరమైనచోట ఇతర ప్రాంతాల నుంచి రప్పించుకుని బృందాలుగా పనిని వేగంగా చేపట్టాలన్నారు.

పనులకు సరిపడ ఇసుక, కంకర, సిమెంట్, స్టీల్ ను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఏపీఎంలు కూడా విద్యాభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని ఆదేశించారు. జూన్ రెండవ వారం పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి అన్ని మరమ్మత్తు పనులు పూర్తిగా చేపట్టాలన్నారు. మరమ్మత్తు పనులు పూర్తి చేసిన తరువాతే కొత్త పనులు చేపట్టాలన్నారు. అలాగే ఇప్పటివరకు పనులు మొదలుకాని పాఠశాలల్లో ఈ శనివారంలోగా పనులను ప్రారంభించాలన్నారు. పనులకు సంబంధించి ఇన్వాయిస్ లను సకాలంలో అప్లోడ్ చేయాలన్నారు. నాడు నేడు పథకానికి నిధులు పుష్కలంగా ఉన్నాయని, ఇప్పటి వరకు 84 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, ఇంకా 48 కోట్ల రూపాయల నిధులు విడుదలై ఉన్నాయని చెప్పారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి నాడు నేడు పనుల్లో పురోగతి సాధించాలని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం మండలాల వారీగా ఎంపిక చేసిన పాఠశాలల్లో చేపడుతున్న అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ రోణంకి కూర్మానాథ్, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వికాస్ మర్మట్, డిఈవో గంగాభవాని, సమగ్ర శిక్ష ఏపీసి ఉషారాణి, ఎంపీడీవోలు, ఎంఈఓలు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.