Clock Of Nellore ( Nellore ) – గెలుపు ఓటమితో సంబంధం లేకుండా నిత్యం ప్రజల కోసం పోరాడుతున్న జనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు ప్రజలు ఒక్క అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి ప్రజలను కోరారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో 35వ రోజు ఆయన పవనన్న ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. 4వ డివిజన్ మైపాడు రోడ్డు, సత్యనారాయణ పురం, నేతాజీ నగర్ ప్రాంతాల్లో పర్యటించి ఇంటింటికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారం కోసం జనసేన పోరాటం చేస్తుందని భరోసా ఇచ్చారు. అనంతరం కేతంరెడ్డి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకున్న మూడు వేల మంది కౌలు రైతులకు అండగా ఉంటూ ఒక్కో కుటుంబానికి పవన్ కళ్యాణ్ లక్ష రూపాయల వంతున సాయం చేశారని గుర్తు చేశారు. అధికారంలో లేకపోయినా ప్రజల కోసం ఇంత తపిస్తున్నారంటే… అదే అధికారం ఉంటే ఇంకా ఎలా చేస్తారో ప్రజలు ఆలోచించాలని కోరారు. 2019 ఎన్నికల్లో జనసేన ఓడిపోయినా నిరుత్సాహం చెందకుండా ఈ మూడేళ్లలో యువత, మహిళలు, కార్మికులు, ఉద్యోగులు, రైతులు.. అన్నీ వర్గాల వారికి పవన్ కళ్యాణ్ అండగా ఉన్నారని వినోద్ రెడ్డి అన్నారు. ఒక్క అవకాశం పేరుతో గద్దెనెక్కి రాష్ట్రాన్ని దోచే వ్యక్తి పవన్ కళ్యాణ్ కాదని పేర్కొన్నారు. చంద్రబాబు, జగన్ పరిపాలనను ఇప్పటి వరకూ చూశారని పవన్ కళ్యాణ్ కు ఒక్క అవకాశం ఇచ్చి చూడాలని కోరారు.
