Clock Of Nellore ( Nellore ) – మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఖాళీ అయిన నెల్లూరుజిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గంకు త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేయనుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ( Somu Veerraju ) స్పష్టం చేశారు. నెల్లూరుకు విచ్చేసిన సోము స్థానిక బిజేపి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనేక మంది ధరఖాస్తు చేసి ఉన్నారని చెప్పారు. అయితే అభ్యర్ధిని ఇంకా ఖరారు చేయలేదని చెప్పారు.
రాష్ట్రంలో అవినీతి, బ్లాక్ మార్కెటింగ్ పేట్రేగి పోతుందని ధ్వజమెత్తారు. అక్రమాలను ప్రశ్నిస్తే పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం అక్రమ కేసులను బనాయిస్తుందని ఆరోపించారు. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నిందితునిగా ఉన్న కేసుకు సంభందించి నెల్లూరు కోర్టులో జరిగిన చోరీ వ్యవహారంలో ఎస్పీ విజయరావు చెప్పిన విషయాలు కామెడీగా ఉన్నాయన్నారు. పోలీసు వ్యవస్థ తమ గౌరవాన్ని కాపాడుకునే విధంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జాతీయ కార్యదర్శి సన్నపురెడ్డి సురేష్ రెడ్డి, బిజేపి జిల్లా అధ్యక్షులు భరత్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి తదితరులు పాల్గొన్నారు.