Clock Of Nellore ( Atmakur ) – దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి రాజకీయ వారసునిగా ఆయన సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి ( Mekapati Vikram Reddy )రాజకీయ ఆరంగేట్రం చేయనున్నారు. ఈ మేరకు మేకపాటి కుటుంబం అధికారికంగా ప్రకటించింది. గౌతమ్ రెడ్డి హఠాన్మరణం తర్వాత ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే ఈహాగానాలకు మేకపాటి కుటుంబం తెరదించుతూ ఈ ప్రకటన చేసింది. మొదట్లో గౌతమ్ రెడ్డి సతీమణి శ్రీకీర్తి రెడ్డి ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారని అందరూ భావించారు. మాజీ ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి వారి కుటుంబసభ్యులు దీనిపై చర్చించి తుది నిర్ణయం తీసుకున్నారు. గౌతమ్ రెడ్డి తమ్ముడు విక్రమ్ రెడ్డిని బరిలోకి దింపాలని నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలియజేశారు. ఊటీలోని గుడ్ షెఫర్డ్ పబ్లిక్ స్కూల్లో విద్యాభ్యాసం చేసిన విక్రమ్ రెడ్డి… చెన్నై ఐఐటిలో చదివారు. అమెరికాలో కన్ స్ట్రక్షన్ మేనేజ్ మెంట్ కోర్సు పూర్తి చేశారు. దివంగత మేకపాటి గౌతమ్ రెడ్డి రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత వారి సొంత అంతర్జాతీయ సంస్థ అయిన కేఎంసి మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజాగా అన్న మరణంతో విక్రమ్ రెడ్డి రాజకీయాల్లోకి అడుగుపెట్టి, ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.