Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులోని విక్రమ సింహపురి యూనివర్శిటీకి నేషనల్ అసెస్ మెంట్, అక్రిడిటేషన్ కౌన్సిల్ ( న్యాక్ ) గుర్తింపు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు యూనివర్శిటీ వైస్ – ఛాన్సలర్ జి.ఎం. సుందరవల్లి తెలియజేశారు. ఆ దిశగా యూనివర్శిటీలో మౌలిక వసతులను పెంపొందిస్తున్నామని పేర్కొన్నారు. నెల్లూరులోని ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఆమె విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. విద్యా ప్రమాణాల పెంపు, సమాజానికి ఉప యుక్తమైన పరిశోధనలతో విక్రమ సింహపురి యూనివర్శిటీకి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. న్యాక్ సర్టిఫికేషన్ కోసం యూనివర్శిటీని సిద్దం చేస్తున్నామని వైస్ – ఛాన్సలర్ సుందరవల్లి తెలిపారు. న్యాక్ గుర్తింపు కోసం దానికి సమర్పించాల్సిన వివిధ అంశాల కోసం కమిటీలను ఏర్పాటు చేశామని తెలియజేశారు.
యూనివర్శిటీ స్నాతకోత్సవాన్ని ఈ ఏడాది ఏప్రిల్ లేదా మే నెలల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్న సుందరవల్లి… త్వరలోనే గవర్నర్ ను కలిసి తేదీలను ఖరారు చేస్తామని చెప్పారు. ఈనెల 28వ తేదీనా యూనివర్శిటీలో జాతీయ సైన్స్ డే ఉత్సవాన్ని నిర్వహిస్తున్నామని ఆ కార్యక్రమాని షార్ డైరెక్టర్ ఏ. రాజరాజన్ ముఖ్య అతిధిగా హాజరవుతారని వెల్లడించారు. అలాగే యూనివర్శిటీలో పూర్వ విద్యార్ధుల సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నామని దానికి సంభందించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అన్నారు. యూనివర్శిటీ అభివృద్ధికి పూర్వ విద్యార్ధుల సహకారం తీసుకుంటామని సుందరవల్లి పేర్కొన్నారు.