Clock Of Nellore ( Kasumuru ) – 30 నెలలుగా చేసిన అభివృద్ధి ఏమీ లేక ఇప్పుడే సర్వేపల్లిని ఏదో ఉద్దరించినట్లు ఊరేగింపులు చేయించుకుంటూ, పూలమాలలు వేయించుకుంటూ హంగామా చేసుకోవడం హస్యాస్పదంగా ఉందని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డిపై మండిపడ్డారు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. శనివారం ఆయన సర్వేపల్లి నియోజకవర్గంలోని కసుమూరులో పర్యటించారు. స్థానిక దర్గాలో ప్రార్ధనలు నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడారు. నెల్లూరు నగరానికి మూడు దిక్కులా విస్తరించి ఉన్న సర్వేపల్లిని ఈ జిల్లాలో కాక కడపలో కలుపుతారా అని ప్రశ్నించారు. సర్వేపల్లిని నెల్లూరులో కొనసాగించడంపై వారోత్సవాల పేరుతో ఊరేగింపులు చేసుకోవడం హాస్యాస్పదమన్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాసం ఉండే సర్వేపల్లిని బాలాజీ జిల్లాలో కలిపే దమ్ము మీకుందా అని ప్రశ్నించారు. సర్వేపల్లిని నెల్లూరులోనే కొనసాగించాలని మీ రంచే ముందే తాము ప్రభుత్వాన్ని కోరి ఉన్నామని సోమిరెడ్డి గుర్తు చేశారు.
