Clock Of Nellore ( Nellore ) – రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతీ గడపకు తీసుకెళ్లి, ప్రభుత్వ ప్రతిష్ఠ పెంచేందుకే గడప గడప గడపకు కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు టిడిపి నేత, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి స్పష్టం చేశారు. ఏడాది పాటూ ప్రజల్లోనే ఉండి వారి బాగోగులు తెలుసుకునేందుకు రూపొందించిన గడప గడపకు కార్యక్రమాన్ని కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి బుధవారం నెల్లూరు 19వ డివిజన్ లో ప్రారంభించారు. రామలింగా పురం సెంటర్ నుండి ఆరంభమైన ఈ కార్యక్రమ తొలిరోజు గిరిధర్ రెడ్డికి మద్దతుగా వేలాది మంది తరలివచ్చారు. అభిమానులు, టిడిపి నేతలు, కార్పొరేటర్లు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా గిరిధర్ రెడ్డి ఇంటింటికి వెళ్లి ప్రజలను పలకరించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వారికి వివరించి కూటమి ప్రభుత్వానికి అండగా ఉండాలని అభ్యర్ధించారు. అర్హత ఉండి సంక్షేమ పథకాలు రాకుంటే వెంటనే ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రజలకు ఏ అవసరం వచ్చినా నేరుగా తమ వద్దకు వస్తే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గడచిన పదేళ్లలో తన సోదరుడు, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రతీ ఇంటికి నాలుగు సార్లు చొప్పున వెళ్లారని, ఆయన స్పూర్తితోనే తాను ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు గిరిధర్ రెడ్డి వెల్లడించారు. కేవలం ఎన్నికల సమయంలోనే కాదని, ఎన్నికలు ఉన్నా లేకున్నా ప్రజలతోనే ఉంటామని స్పష్టం చేశారు. అందుకే రూరల్ నుండి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని పేర్కొన్నారు.
