Clock Of Nellore ( Nellore ) – ఎన్నికల ఫలితాల తర్వాత నెల్లూరుజిల్లా వ్యాప్తంగా వైసీపి శ్రేణులపై అధికార టిడిపి నేతలు పాల్పడుతున్న హింసాత్మక ఘటనలపై చర్యలు తీసుకోవాలని వైసిపి నేతలు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ను కోరారు. సోమవారం సాయంత్రం మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ మేరుగ మురళి, వైసీపి జిల్లా అధ్యక్షులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు నెల్లూరులోని జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ను కలిసి ఫిర్యాదు అందజేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపి శ్రేణులే లక్ష్యంగా కొందరు ప్రజా ప్రతినిధులు, టిడిపి నేతలు దాడులు, హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారని, నేటికి అది కొనసాగుతుందని పేర్కొన్నారు. దీనిపై ఎస్పీ సానుకూలంగా స్పందించినట్లు అనంతరం వైసిపి నేతలు తెలియజేశారు. ఎస్పీని కలిసిన అనంతరం మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జిల్లా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా విపక్ష పార్టీ నేతలపై బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరినట్లు వెల్లడించారు.
