Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు సిటీలో మాజీ మంత్రి నారాయణను నమ్మి పార్టీ కోసం పనిచేస్తూ నేతలు, కార్యకర్తలు మోసపోవద్దని… ఎన్నికలు అయిపోగానే ఆయన కనిపించరని… టిడిపి నేతలు, కార్యకర్తలు నారాయణను నమ్మవద్దని మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ సూచించారు. ఆయన్ను నమ్ముకుంటే నట్టేటా మునిగినట్లేనని విమర్శించారు. నెల్లూరులోని ఆయన కార్యాలయంలో గురువారం అనీల్ మీడియా సమావేశం నిర్వహించి టిడిపి నేత నారాయణే లక్ష్యంగా మాట్లాడారు. నెల్లూరు సిటీలో వైసిపి సానుభూతి పరుల ఓట్లను నారాయణ తన కళాశాల సిబ్బందిచే తొలగింపజేస్తున్నారని ఆరోపించారు. ఆన్ లైన్ ద్వారా ధరఖాస్తులు చేయించి కొంత మంది చనిపోయినట్లు, కొంత మంది చిరునామా మారినట్లు ధరఖాస్తులు చేయిస్తున్నారని మండిపడ్డారు. దీనిపై స్పష్టమైన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, దీనిపై నవాబుపేట పోలీసులకు ఇప్పటికే ఫిర్యాదు చేశామన్నారు. టిడిపి నేత నారాయణ దొంగ ఓట్లను నమోదు చేయిస్తూ తమపైనే బురదజల్లుతున్నారని అనీల్ కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో అసైన్డ్ భూములను కారుచౌకగా నారాయణ కాజేశారని అనీల్ యాదవ్ ఆరోపించారు. దానికి సంభందించి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని, దానిపై సిఐడి విచారణకు పిలిస్తే తనకు ఆరోగ్యం బాగాలేదని అబద్ధాలు చెబుతూ న్యాయస్థానాలను సైతం మోసం చేస్తున్నారన్నారు. ఆరోగ్యం బాగాలేదని న్యాయస్థానానికి చెబుతున్న నారాయణ… టిడిపి చేసే కార్యక్రమాలకు ఎలా హాజరవుతున్నారని ప్రశ్నించారు. నెల్లూరులో అక్కడక్కడా తిరుగుతూ తనపై విమర్శలు చేస్తున్నారని దానికి ఆరోగ్యం ఎక్కడి నుంచి వచ్చిందని అన్నారు. నారాయణ ఓ వైట్ కాలర్ క్రిమినల్ అని ప్రజలు ఆయన్ను నమ్మవద్దని కోరారు.