Clock Of Nellore ( Nellore ) – తెలుగుదేశం పార్టీ మహిళలను గౌరవించడమే తప్పా కించపరిచే విధంగా అప్పుడు, నేడూ, ఏనాడు వ్యవహరించదని ఆ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు అబ్ధుల్ అజీజ్ స్పష్టం చేశారు. తన కుటుంబంలోని మహిళలపై సోషల్ మీడియాలో ప్రత్యర్ధులు అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారని నిన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దానిపై అజీజ్ స్పందించారు. శుక్రవారం నెల్లూరులోని టిడిపి జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సతీమణి తనకు అక్కలాంటిదని, వారి పిల్లలు నా పిల్లల మాదిరిగానే అని పేర్కొన్నారు. అసభ్యకరంగా పోస్టులు పెడితే పోలీసు కేసు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. పోలీసు కేసు పెడితే తాము కూడా మద్దతు తెలియజేస్తామని అజీజ్ పేర్కొన్నారు. ఆడవారి మాటలకు అర్ధాలే వేరు అనే సామెతలా శ్రీధర్ రెడ్డి మాటలకు కూడా అర్ధాలు వేరని సంభోదించారు. సర్వేలు అనుకూలంగా వచ్చినంత మాత్రానా గెలిచినట్లు కాదని, న్యాయ నిర్ణేతలు ప్రజలు అని వెల్లడించారు. నెల్లూరు రూరల్ టిక్కెట్ ఇంకోకరికి వెళ్తుందన్న భయంతోనే సర్వేలన్నీ తనకే అనుకూలంగా ఉన్నాయంటూ సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి జగన్ నే హెచ్చరిస్తున్నట్లు ఉందని తెలియజేశారు. సత్యం ఏదో అసత్యం ఏదో ప్రజలకు తెలుసునని, శ్రీధర్ రెడ్డి పరిపాలన ఎలా ఉందో కూడా ప్రజలు వచ్చే ఎన్నికల్లో స్పష్టం చేస్తారన్నారు. ఈ విలేకరుల సమావేశంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి జెన్ని రమణయ్య, నేతలు జలదంకి సుధాకర్, సాభీర్ ఖాన్, గంగాధర్, అస్లాం, బిల్లుపాటి రవి పాల్గొన్నారు.