Clock Of Nellore ( Nellore Rural ) – జిల్లా పరిషత్ హైస్కూల్ లో విద్యార్ధులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు నెల్లూరు జడ్ఫీ ఛైర్ – పర్సన్ ఆనం అరుణమ్మ. విద్యార్ధులతో కాసేపు గడిపి యోగక్షేమాలు అడిగారు. విద్యా భోధన ఎలా ఉందంటూ ఆరా తీశారు. ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. నెల్లూరు రూరల్ మండలం, పాత వెల్లంటిలోని జిల్లా పరిషత్ హైస్కూల్ ను అధికారులతో కలిసి గురువారం ఆమె తనిఖీ చేశారు. హైస్కూల్ లో మౌలిక సదుపాయాలను తనిఖీ చేశారు. పాఠశాల భవనాన్ని పరిశీలించి నూతనంగా నిర్మిస్తున్న భవనాన్ని త్వరితగతిన పూర్తి చేయించాలని అధికారులకు సూచించారు. పాత భవనానికి కూడా మరమ్మత్తు చేయాలని దానికి అవసరమైన నిధులను జిల్లా పరిషత్ నుండి విడుదల చేస్తామని ఆనం అరుణమ్మ తెలియజేశారు. వర్షాలు కురుస్తున్న నేపద్యంలో స్కూల్ ఆవరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, సీజనల్ వ్యాధులు ప్రభలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెడ్ మాస్టర్ ను ఆదేశించారు. అనంతరం మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించి విద్యార్ధులకు స్వయంగా భోజనాన్ని వడ్డించారు. విద్యార్ధులతో కలిసి కింద కూర్చొని ఆమె కూడా భోజనం చేశారు. భోజనం పరిశుభ్రంగా ఉండాలని మధ్యాహ్న భోజన నిర్వాహకులకు సూచించారు. తరువాత విద్యార్ధులకు బిస్కెట్లు పంపిణీ చేసి, స్కూల్ ఆవరణంలో మొక్కలు నాటారు. స్కూల్లో ఇద్దరు ఉపాధ్యాయుల కొరత ఉందని, నాన్ టీచింగ్ స్టాఫ్ లేరని హెడ్ మాస్టర్ ఛైర్ – పర్సన్ అరుణమ్మ దృష్ఠికి తీసుకెళ్లగా ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
