Clock Of Nellore ( Nellore ) – బ్రాహ్మణులకు అండగా నిలిచే బ్రాహ్మణ కార్పొరేషన్ ను వైసీపి ప్రభుత్వం నిర్వీర్యం చేసి వారికి తీవ్ర అన్యాయం చేసిందని జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆరోపించారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే బ్రాహ్మణుల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. పవనన్న ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరంలో గడప గడపకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నకేతంరెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. 127వ రోజైన బుధవారం ఆయన 50వ డివిజన్ లోని సంతపేటలో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీని ఆశీర్వదించాలని కోరారు. సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా వినోద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు బ్రాహ్మణుల అభివృద్ధికి దోహదపడతానని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి… ముఖ్యమంత్రి అయిన తర్వాత బ్రాహ్మణ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేసి వారికి తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. పౌరోహిత్యాన్ని వృత్తిగా చేసుకుని జీవిస్తున్న బ్రాహ్మణులు కరోనా కష్టకాలంలో తీవ్ర ఇబ్బందులు పడ్డారని, ఆ సమయంలో ప్రభుత్వం కనీస సాయం కూడా చేయలేదని అన్నారు. నిరుపేద బ్రాహ్మణులకు ప్రభుత్వ పథకాలు అందడం లేదని పేర్కొన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాగానే బ్రాహ్మణుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు.
