Clock Of Nellore ( Nellore ) – ఈ నెల 6వ తేదీన జరిగే ముఖ్యమంత్రి జిల్లా పర్యటనను ఎలాంటి లోటుపాట్లు లేకుండా అందరూ సమన్వయంతో విజయవంతం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 6 వ తేదీన జిల్లాలోని మేకపాటి గౌతంరెడ్డి సంగం బ్యారేజ్, నెల్లూరు పెన్నా బ్యారేజ్ ను ప్రారంభిస్తున్న నేపథ్యంలో శనివారం నెల్లూరు నగరంలోని కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుతో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి కాకాణి మాట్లాడుతూ మేకపాటి గౌతంరెడ్డి సంగం బ్యారేజీ, నెల్లూరు పెన్నా బ్యారేజీ ప్రారంభోత్సవ ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని సూచించారు. ముఖ్యంగా రెండు ప్రదేశాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. సంగంలో హెలిపాడు, బ్యారేజ్, బహిరంగ సభ వద్ద పక్కా బారికేడింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. బహిరంగ సభ వద్ద రైతులతో ముఖాముఖి ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలు, వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. హెలిప్యాడ్ ల వద్ద ముఖ్యమంత్రికి స్వాగతం పలికే ప్రముఖుల జాబితా సిద్ధంగా ఉంచుకొని వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. ముఖ్యమంత్రి వెంట కాన్వాయ్ లో వచ్చే ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తదితర ప్రజా ప్రతినిధులను తీసుకెళ్లేందు కోసం మంచి వాహనాలను సమకూర్చాలన్నారు.

అంతకు ముందు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా మేకపాటి గౌతంరెడ్డి సంగం బ్యారేజీ, నెల్లూరు పెన్నా బ్యారేజీ వద్ద జిల్లా యంత్రాంగం చేపట్టిన పనుల వివరాలను తెలియజేశారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ సిహెచ్ విజయ రావు, సంయుక్త కలెక్టర్ ఆర్. కూర్మానాధ్, కందుకూరు, ఉదయగిరి, ఆత్మకూరు శాసనసభ్యులు మానుగుంట మహీదర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మేకపాటి విక్రమ్ రెడ్డి, నగర మేయర్ స్రవంతి, అదనపు ఎస్పీలు హిమవతి, చౌడేశ్వరి, డిఆర్ఓ వెంకట నారాయణమ్మ, తెలుగు గంగ ప్రాజెక్టు ప్రత్యేక కలెక్టర్ బాపిరెడ్డి, సీ.ఈ. హరి నారాయణ రెడ్డి, డి ఆర్ డి ఏ,డ్వామా పిడిలు సాంబశివరెడ్డి, వెంకటరావు, జలవనరుల శాఖ ఎస్.ఈ. లు కృష్ణమోహన్, రమణారెడ్డి, డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ పెంచలయ్య, డిఎస్ఓ వెంకటేశ్వర్లు, నెల్లూరు, ఆత్మకూరు ఆర్డీవోలు మలోల, కరుణ కుమారి, డిటిసి చందర్ తదితర జిల్లా అధికారులు పోలీసు అధికారులు పాల్గొన్నారు.
