Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నగర వ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుగుతున్న వినాయక చవితి వేడుకల్లో మేయర్ స్రవంతి పాల్గొన్నారు. స్థానిక 2వ డివిజన్ గుడిపల్లిపాడు లోని యస్.సి.కాలనీ యూత్ ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి మేయర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వాహకులు ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని మేయర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ స్రవంతి మాట్లాడుతూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వై.సి.పి.రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక దృష్టి పెట్టి ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఘాట్ వద్ద వినాయక నిమర్జన ఏర్పాట్లను చేయడం జరిగిందని, అందుకు సహకరిస్తూ భక్తులందరూ 4వ తేదీ సామూహిక నిమర్జనానికి సిద్ధం కావాలని కోరారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుని ఆశీస్సులు ప్రజలందరూ పొందాలని, అత్యంత భక్తి శ్రద్ధలతో కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో 2వ డివిజన్ కార్పొరేటర్ పడిగినేటి రామ్మోహన్, గుడిపల్లిపాడు యస్.సి.కాలనీ యూత్ మధు, సతీష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
