మోకాళ్ల మార్పిడి, తుంటి ఆపరేషన్లలో విప్లవాత్మక మార్పులు… అపోలో వైద్యుల ప్రకటన

  • మోకాళ్లు మార్పిడి, తుంటి ఆప‌రేష‌న్స్‌లో విప్ల‌వాత్మ‌క మార్పులు
  • రోబోటిక్ స‌ర్జ‌రీతో రోగికి ఎంతో మేలు
  • త‌క్కువ నొప్పి, ఖచ్చిత‌త్వంతో రోబోటిక్ స‌ర్జ‌రీ
  • రోబోటిక్ స‌ర్జ‌రీ గురించి తెలిపిన అపోలో హాస్పిటల్స్ అర్థోపెడిక్స్ సర్జన్ డాక్ట‌ర్ మ‌ధ‌న్ మోహ‌న్‌రెడ్డి

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులోని అపోలో స్పెషాలిటీ హాస్పిట‌ల్‌లో హాస్పిట‌ల్ సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్‌, ఆర్థోపెడిక్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ మ‌ద‌న్ మోహ‌న్ రెడ్డి విలేక‌ర్ల స‌మావేశం నిర్వ‌హించారు. సర్జిరీలు సక్సెస్ అయిన పేషెంట్లు, డాక్టర్లు పమ్మి కార్తీక్ రెడ్డి, వివేకానంద రెడ్డి, శశిధర్ రెడ్డి, శ్రీనివాస్, పృథ్వితో కలిసి మదన్ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మోకాళ్ల మార్పిడి, తుంటి ఆప‌రేష‌న్ల‌ల‌లో రోబోటిక్ స‌ర్జ‌రీ ఓ విప్ల‌వాత్మ‌క‌మైన మార్పుకు శ్రీ‌కారం చుట్టింద‌ని అన్నారు. అతి త‌క్కువ నొప్పి, ఖ‌చ్చిత‌త్వంతో జ‌రిగే ఈ రోబోటిక్ ఆప‌రేష‌న్లు, రోగి త్వ‌ర‌గా కోలుకునేందుకు ఎంతో దోహ‌ప‌ద‌ప‌డుతుంద‌ని అన్నారు. సాధార‌ణ ఆప‌రేష‌న్ల క‌న్నా ఎన్నో రెట్లు మేలుగా ఈ రోబోటిక్ స‌ర్జ‌రీ ఉంద‌ని చెప్పారు. 2025 సంవ‌త్స‌రానికి 60 మిలియ‌న్ల మంది రోగుల‌తో ప్ర‌పంచంలోనే భార‌త‌దేశం మోకాళ్ల నొప్పులు రోగులు అధికంగా ఉన్న దేశంగా మారుతుంద‌ని ఓ అంచ‌నా ఉంద‌ని, ఈ త‌రుణంలో రోబోటిక్ స‌ర్జ‌రీ అందుబాటులోకి రావ‌డం సంతోష‌క‌ర‌మ‌ని అన్నారు. నేటి కాలంలో వృద్ధులే కాకుండా, యువ‌కులు కూడా మోకాళ్ల నొప్పుల‌తో బాధ‌ప‌డుతున్నార‌ని, ప్రారంభ‌ ద‌శ‌లో కొంత ఉప‌శ‌మ‌నం క‌లిగిన‌ప్ప‌టికీ, వ్యాధి ముదిరిన త‌రువాత మోకాళ్ల మార్పిడి ప‌రిష్కార మార్గంగా మారుతుంద‌ని అన్నారు. ద‌శాబ్దాలుగా జ‌రుగుతున్న సాంప్ర‌దాయ మోకాళ్ల మార్పిడి ఆప‌రేష‌న్‌ల‌లో అనేక ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని అన్నారు.

అయితే ప్ర‌స్తుతం అందుబాటులోకి వ‌చ్చిన రోబోటిక్ స‌ర్జ‌రీలో తొలుత రోగి మోకాళ్ల‌ను వ‌ర్చువ‌ల్ 3డి స్కానింగ్ చేస్తార‌ని ఆ త‌రువాత సిటి స్కాన్ ఆధారంగా ఎక్క‌డ ఎముక భాగానికి ఆప‌రేష‌న్ చేయాలో ఖచ్చితంగా నిర్ధారించుకుంటార‌ని, దీనికి అనుగుణంగా వ‌ర్చువ‌ల్ ప్లాన్ సిద్ధం చేసి, ఈ ప్లానింగ్‌ని ఆప‌రేష‌న్ ధియేట‌ర్‌లో లాక్ చేసి, దానికి అనుగుణంగా రోబోటిక్ స‌ర్జ‌రీ జ‌రుగుతుంద‌ని వెల్ల‌డించారు. అత్యంత ఖ‌చ్చిత‌మైన ఎముక కోత‌లు, ఇంప్లాంట్‌ల విష‌యంలో ఇది ఎంతో స‌హాయ‌ప‌డుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. మాన్యువల్ సర్జరీతో పోలిస్తే రోబోటిక్ ఆర్మ్-అసిస్టెడ్ సర్జరీ చేయించుకున్న రోగులు మెరుగైన ప్రారంభ పనితీరు, తక్కువ పోస్ట్-ఆప్ నొప్పి, అనాల్జెసిక్స్ కోసం తక్కువ అవసరం, వేగంగా కోలుకోవడం జ‌రిగింద‌ని అన్నారు. చెన్నై అపోలో హాస్పిట‌ల్‌లో మోకాళ్ల మార్పిడి విష‌యంలో ఈరోబోటిక్ స‌ర్జ‌రీ అందుబాటులో ఉంద‌ని, ప్ర‌పంచ స్ధాయి సాంకేతిక‌త‌తో జ‌రుగుతున్న ఈ స‌ర్జ‌రీ చేయించుకున్న ఎంతో మంది సాధార‌ణ జీవితం హాయిగా గడుపుతున్నార‌ని వెల్ల‌డించారు. అవ‌స‌ర‌మైన వారు ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌న్నారు. ఈ పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన తో పాటు ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, ఆర్థోపెడిక్ సర్జన్లు డాక్టర్ పెమ్మి కార్తీక్ రెడ్డి, డాక్టర్ చీమల వివేకానంద రెడ్డి, డాక్టర్ శశిధర్ రెడ్డి అనస్థీషియన్ డాక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Read Previous

ఓటు హక్కు ఉపయోగించుకోండి – ఏఎస్ఆర్ విద్యార్ధుల వినూత్న ప్రదర్శన

Read Next

కమ్యూనిటీ హాల్ ప్రహరీకి నిధులు మంజూరు : వెల్లడించిన జడ్పీ ఛైర్ పర్సన్

Leave a Reply

Your email address will not be published.