Clock Of Nellore ( Nellore ) – పదవ తరగతి పరీక్షల్లో ప్రశ్నా పత్రాలను లీక్ చేసిన నారాయణ, శ్రీ చైతన్య విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని అలాగే పరీక్షల నిర్వహణలో పూర్తిగా విఫలమైన విద్యా శాఖ మంత్రి బొత్స సత్య నారాయణను ప్రభుత్వం నుండి బర్త్ రఫ్ చేయాలని భారతీయ జనతా యువమోర్చా నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఎన్.కె. యశ్వంత్ సింగ్ ఠాకూర్ డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం యశ్వంత్ సింగ్ మాట్లాడుతూ పశ్నా పత్రాల లీకేజీకి పాల్పడింది నారాయణ, శ్రీ చైతన్య విద్యా సంస్థలేనని గత నెల 30వ తేదీనా బిజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు కేతినేని సురేంద్ర మోహన్ చెప్పినా ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని గుర్తు చేశారు. లీకేజీకి కారణం నారాయణ, శ్రీ చైతన్య విద్యా సంస్థలేనని సాక్షాత్తూ ముఖ్యమంత్రే తిరుపతిలో ప్రకటించారని, ముఖ్యమంత్రి చెప్పినా అధికారులు ఇంత వరకూ ఆయా సంస్థలపై చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. తక్షణం ఆ రెండు విద్యా సంస్థల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకూ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం వెనుక అనేక అనుమానాలకు తావిస్తుందని ఇకనైనా అధికారులు స్పందించాలని లేదంటే బిజేవైఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు సాయి కుమార్, మహేష్, భార్గవ్, కమలేష్, మధు పాల్గొన్నారు.