Clock Of Nellore ( Delhi ) – స్వచ్ఛ భారత్ నిధుల విడుదలలో ఎందుకు జాప్యం చేస్తున్నారని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గురువారం పార్లమెంటులో ప్రశ్నించారు. దీనికి కేంద్ర జల శక్తి శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ రాత పూర్వకంగా సమాధానమిస్తూ గ్రామీణ స్వచ్ఛ భారత్ మిషన్ నిధుల విడుదలలో కొన్ని నిబంధనలను రూపొందించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వాటా మొత్తాన్ని రాష్ట్ర ఖజానా నుంచి కార్యక్రమాన్ని అమలు చేసే ఏజెన్సీకి డిపాజిట్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం వెంటనే నిధులను విడుదల చేస్తుందని తెలిపారు. ఈ మేరకు 2020 మే 14న ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక లేఖను రాసినట్లు పేర్కొన్నారు. అందువల్ల వాటా మొత్తాన్ని జమ జేయడంతో పాటు బడ్జెట్లోనూ ఈ మేరకు కేటాయింపులు జరగాలని తెలిపారు. అప్పుడే సత్వర నిధులు కేటాయింపుతో పాటు సమీక్ష కూడా జరుగుతుందని పేర్కొన్నారు.