Clock Of Nellore ( Gudur ) – మద్యం విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ రెండో రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలిపింది. రెండో రోజైన ఆదివారం నెల్లూరుజిల్లాలోని గూడూరు పట్టణంలో మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ వినూత్నంగా నిరసన తెలిపారు. జే బ్రాండ్స్ పోవాలి – ప్రజల ప్రాణాలు నిలవాలంటూ ముందుగా పట్టణంలో కార్యకర్తలతో కలిసి నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో మహిళలు అధికంగా పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద మద్యం బాటిళ్లను పగులగొట్టి ప్రభుత్వ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ మాట్లాడుతూ జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుండి రాష్ట్రంలో నాటు సారా ఏరులై పారుతుందని ఆరోపించారు. జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా కారణంగా 18 మంది మరణించిన ప్రభుత్వంలో చలనం కూడా లేదని అన్నారు. మద్యం ధరలు విపరీతంగా పెంచడంతో పాటూ సాసిరకమైన జగన్ బ్రాండ్ మద్యాన్ని ప్రవేశపెట్టడంతోనే నాటు సారా వినియోగం విపరీతంగా పెరిగిందన్నారు. నాణ్యమైన మద్యం బ్రాండ్లను అందించాల్సిన ప్రభుత్వం… కమీషన్ల కోసం నకిలీ బ్రాండ్లను ప్రవేశపెట్టి ప్రజల ప్రాణాలను తీస్తుందని విమర్శించారు. తక్షణం ప్రభుత్వం నకిలీ మద్యం బ్రాండ్లను తీసివేసి నాణ్యమైన మద్యం బ్రాండ్లను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.
