Clock Of Nellore ( Gudur ) – నెల్లూరుతో విడదీయరాని బంధం ఉన్న గూడూరు నియోజకవర్గాన్ని ప్రతిపాదిత శ్రీ బాలాజీ జిల్లాలో కలపాలని అనుకోవడం అత్యంత దారుణమైన విషయమని టిడిపి నేత, గూడూరు మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు. గూడూరు కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలని లేని పక్షంలో గూడూరును నెల్లూరుజిల్లాలోనే ఉంచాలని డిమాండ్ చేశారు. శ్రీ బాలాజీ జిల్లాలో కలపడాన్ని నిరసిస్తూ అఖిల పక్షం నేతలు గత మూడు రోజులుగా గూడూరులోని టవర్ క్లాక్ సెంటర్ లో నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఇవాళ దీక్షలు ముగిశాయి. దీక్ష ముగింపు అనంతరం మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ మాట్లాడుతూ గూడూరును నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బుధవారం నియోజకవర్గ బంద్ ను నిర్వహిస్తున్నామన్నారు. బంద్ ను ప్రజలు, వ్యాపారవేత్తలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బంద్ లో యువత భారీ స్థాయిలో పాల్గొనాలని సూచించారు. పార్టీలకు అతీతంగా ఈ బంద్ జరుగుతుందని స్పష్టం చేశారు.
