Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నగరంలో ( Nellore Muncipal Corporation ) వేసవి కాలం నేపద్యంలో ఏర్పడే మంచినీటి ఎద్దడిని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు నగర పాలక సంస్థ అధికారులు పటిష్టమైన ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని నగర మేయర్ పొట్లూరి స్రవంతి, వైసిపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలు సూచించారు. కార్పొరేషన్ లోని మేయర్ కార్యాలయంలో రూరల్ నియోజకవర్గానికి సంభందించి మంచి నీటి సమస్యపై కార్పొరేటర్లు, డివిజన్ ఇంఛార్జ్ లు, నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం, పబ్లిక్ హెల్త్ , విద్యుత్ శాఖ అధికారులతో మంగళవారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతీ ఏటా వేసవి కాలపు పరిస్థితులకు అనుగుణంగా వివిధ డివిజన్లలో ( Nellore City ) త్రాగు నీరు సరఫరాలో జరిగే అంతరాయాల గురించి తెలిపారు. ముఖ్యంగా నగర పాలక సంస్థ మంచినీరు సరఫరా చేసే సమయంలో విద్యుత్ అంతరాయం కలిగితే స్థానిక ప్రజలు ఇబ్బందికి గురవుతారని ఆవేదన వెలిబుచ్చారు.

కార్పొరేషన్, విద్యుత్ శాఖ అధికారులు సమన్వయం చేసుకుని నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయాలు కలుగకుండా జాగ్రత్తలు వహించాలని అధికారులను ఆదేశించారు. రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం కుటుంబాలు వేకువ జాముకు ముందే పవిత్ర ఉపవాస దీక్షలు చేపడుతున్నందున, వారిని దృష్టిలో ఉంచుకుని నీటి సరఫరాలో సమయపాలన ప్రణాళికా బద్ధంగా ఉండేలా రూపొందించుకోవాలని అధికారులకు వారు సూచించారు. ఈ సమావేశంలో 32 వ డివిజన్ కార్పొరేటర్ తాళ్లూరి అవినాష్, 28 వ డివిజన్ ఇంచార్జ్ చెక్క సాయి సునీల్, 33 వ డివిజన్ ఇంచార్జ్ కరణం హజరత్ నాయుడు, పబ్లిక్ హెల్త్ విభాగం డిప్యూటీ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ సూపరింటెండింగ్ ఇంజనీర్, నగర పాలక సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, డిప్యూటీ ఇంజనీర్ లు పాల్గొన్నారు.