Clock Of Nellore ( Gudur ) – రైతులు పండించే ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 23వ తేదీనా ఛలో నెల్లూరు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రకటించారు. పార్టీలకు అతీతంగా రైతులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గూడూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ కలిసి టిడిపి నేతలతో సోమిరెడ్డి సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రైతాంగ సమస్యలపై ఈనెల 23న ఛలో నెల్లూరు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నర్తకి సెంటర్ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించి అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తామన్నారు.

రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తూ ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఎక్కడా కొనుగోలు చేయడం లేదని, ప్రభుత్వం చెప్పిన గిట్టుబాటు ధర కూడా ఇవ్వడం లేదన్నారు. పసుపు రైతులు కూడా పండించిన పంటను అమ్ముకునే పరిస్థితి లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ప్రభుత్వం వెంటనే పసుపు యార్డును ఏర్పాటు చేయాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. ఈనెల 23 న జరిగే ఛలో నెల్లూరును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
