Clock Of Nellore ( Nellore ) – నిరుపేదలుగా ఉండి పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలనుకునే వారికి ఆంధ్రప్రదేశ్ దళిత ఎంటర్ ప్రైనర్స్ అండ్ ఎంపవర్ మెంట్ అసోసియేషన్ బాసటగా నిలిచి వారి కలలను నిజం చేసేందుకు కృషి చేస్తుందని ఆంధ్రప్రదేశ్ MSME డెవలప్ మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ కరీముల్లా అన్నారు. ఈనెల 15వ తేదీనా నెల్లూరులోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భవన్ లో జరిగే MSME అవగాహన సదస్సును పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలనుకునే నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నెల్లూరులోని ప్రెస్ క్లబ్ లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ దళిత ఎంటర్ ప్రైనర్స్ అండ్ ఎంపవర్ మెంట్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా కో – ఆర్డినేటర్ డోలా శ్రీహరి ప్రసాద్ తో కలిసి షేక్ కరీముల్లా మాట్లాడారు.
ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనార్టీ వర్గాలకు చెందిన ఔత్సాహికులు, విద్యావేత్తలు పారిశ్రామికులుగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటూ కేంద్ర ప్రభుత్వం కూడా వివిధ పథకాలను అమలు చేస్తుందని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో వైఎస్ఆర్ బడుగు వికాస పథకం, కేంద్ర స్థాయిలో పి.ఎం.ఈ.జి.పి పథకాలు అమల్లో ఉన్నాయని అయితే వాటి వివరాలు అందరికీ సరిగా తెలియడం లేదని చెప్పారు. అలాంటి పథకాల వివరాలను బడుగు, బలహీన వర్గాల విద్యా వంతులు, ఔత్సాహికులకు తెలియజేసి వారిని పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ దళిత ఎంటర్ ప్రైనర్స్ అండ్ ఎంపవర్ మెంట్ అసోసియేషన్ కృషి చేస్తుందని తెలియజేశారు. ఈనెల 15వ తేదీనా ఆంధ్రప్రదేశ్ దళిత ఎంటర్ ప్రైనర్స్ అండ్ ఎంపవర్ మెంట్ అసోసియేషన్ నెల్లూరులో అవగాహన సదస్సు నిర్వహిస్తుందన్నారు.
ఈ అవగాహన సదస్సుకు రాష్ట్ర MSME డెవలప్ మెంట్ కార్పొరేషన్ అధికారులతో పాటూ కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రతినిధులు, పరిశ్రమల శాఖ, బ్యాంకు అధికారులు, ఆంధ్రప్రదేశ్ దళిత ఎంటర్ ప్రైనర్స్ అండ్ ఎంపవర్ మెంట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రతినిధులు, జిల్లా అధికారులు హాజరయ్యి దళితులు ఏ విధంగా పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలనే దానిపై అవగాహన కల్పించడంతో పాటూ పరిశ్రమల స్థాపనకు అవసరమైన విధి విధానాలను తెలియజేస్తారని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ దళిత ఎంటర్ ప్రైనర్స్ అండ్ ఎంపవర్ మెంట్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా కో – ఆర్డినేటర్ డోలా శ్రీహరి ప్రసాద్ మాట్లాడుతూ దళితులతో పాటూ ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన ఔత్సాహికులు ఈ అవగాహన సదస్సును సద్వినియోగం చేసుకుని పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. తమ అసోసియేషన్ ద్వారా పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన విధి విధానాలను తామే పూర్తి చేయిస్తామని పేర్కొన్నారు. దళితులు పారిశ్రామిక వేత్తలుగా ఎదగడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయని అయితే వాటిపై ఎవరికీ అవగాహన లేక సద్వినియోగం చేసుకోలేక పోతున్నారని, ఈ సదస్సు ద్వారా అనేక విషయాలను తెలియజేస్తామని శ్రీహరి ప్రసాద్ తెలియజేశారు. ఔత్సాహికులు ఈనెల 15వ తేదీనా నెల్లూరులోని అంబేద్కర్ భవన్ లో జరిగే అవగాహన సదస్సును సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకూ జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. ఇతర వివరాలకు 7780531919 ఫోన్ నంబర్ ను సంప్రదించాలని కోరారు.