Clock Of Nellore ( Nellore ) – జూన్ 4న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ జరగనున్న నేపద్యంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా ముందస్తు చర్యలకు ఉపక్రమించింది నెల్లూరుజిల్లా పోలీసు శాఖ. శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటామో తెలియజేస్తూ పోలీసులు మంగళవారం నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్ లో మాబ్ ఆపరేషన్ డ్రిల్ ను నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ ఆధ్వర్యంలో స్పెషల్ పార్టీ పోలీసులు అల్లరి మూకలు హింసాత్మక చర్యలకు పాల్పడితే ఎలాంటి చర్యలు తీసుకుంటామనే దానిపై డెమో ద్వారా ప్రదర్శించారు. అవసరమైతే కాల్పులు చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీని కోసం ప్రత్యేక టీములను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సౌజన్య తదితరులు పాల్గొన్నారు.
