Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులో కురిసిన వర్షానికి రోడ్లు గుంతల మయంగా, కాలువలు మురికి కూపాలుగా మారడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి ధ్వజమెత్తారు. పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఈ పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు. పవనన్న ప్రజాబాటలో భాగంగా ఆయన 183వ రోజైన మంగళవారం నెల్లూరు 42వ డివిజన్ పర్యటించారు. మన్సూర్ నగర్ లో ఇంటింటికి వెళ్లి ప్రజలను పలకరించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు మురుగు నీరు, గుంతల రోడ్లతో ఇబ్బందులు పడుతున్నామని తెలియజేశారు. అనంతరం వినోద్ రెడ్డి మాట్లాడుతూ రెండు రోజుల వర్షానికే నెల్లూరు చెరువును తలపించిందని, కాలువల్లో సకాలంలో పూడికలు తీయకపోవడంతోనే వర్షం నీరు రోడ్లపైకి, ఇళ్లల్లోకి ప్రవేశిస్తున్నాయన్నారు. చిన్నపాటి వర్షానికే రోడ్లు గంతలమయంగా మారాయని పాలకుల నిర్లక్ష్యమే దీనికి కారణమని విమర్శించారు. వర్షాల కారణంగా ప్రజలు విష జ్వరాలతో అల్లాడుతున్నారని, తక్షణం అధికారులు, పాలకులు స్పందించాలని డిమాండ్ చేశారు.
