Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నగరంతో పాటూ రూరల్ ప్రాంతంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దాసరి రాజేంద్ర అనే పాత నేరస్తుణ్ని బాలాజీ నగర్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అతని నుండి 108 గ్రాముల బంగారం, 150 గ్రాములు వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై నెల్లూరు నగర డిఎస్పీ శ్రీనివాసులు రెడ్డి బాలాజీ నగర్ పోలీసు స్టేషన్ లో విలేకరుల సమావేశం నిర్వహించి కేసు వివరాలను వెల్లడించారు. హరనాథపురం మొదటి వీధిలో నివాసం ఉండే దాసరి రాజేంద్ర 2018వ సంవత్సరం నుండి చోరీలకు పాల్పడుతున్నాడు. గతంలో 7 చోరీలకు సంభందించిన కేసులో జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. జైలు నుండి విడుదలైనా పద్దతి మార్చుకోకుండా మళ్లీ చోరీలు చేయడం ప్రారంభించాడు. ఇటీవల బాలాజీ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో నాలుగు చోరీలకు పాల్పడ్డాడు. చోరీలతో అప్రమత్తమైన బాలాజీ నగర్ పోలీసులు నిఘా పెట్టి నిందితుడు దాసరి రాజేంద్రను అదుపులోకి తీసుకుని విచారించగా నాలుగు చోరీలు చేసింది తానేనని అంగీకరించాడు. దీంతో అతన్ని మంగళవారం అరెస్ట్ చేసినట్లు డిఎస్పీ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. అతని వద్ద నుండి చోరీ అయిన బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని తెలియజేశారు. ఈ విలేకరుల సమావేశంలో బాలాజీ నగర్ సిఐ రాములు నాయక్, ఎస్సై భోజ్యా తదితరులు పాల్గొన్నారు.
