నెల్లూరు హైవే పక్కనే అదిరిపోయే సౌకర్యాలు : సిఎంకు వివరించిన కలెక్టర్ శుక్లా

Clock Of Nellore ( Nellore ) – జిల్లాలో రోడ్డు మరియు హైవే మార్గాల వెంట ప్రయాణికులకు అవసరమైన ఆధునిక సౌకర్యాలను కల్పించే వేసైడ్ అమెనిటీస్ (Wayside Amenities) ఏర్పాటుకు పెట్టుబడిదారుల నుంచి గణనీయమైన ఆసక్తి వ్యక్తమవుతోందని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల అన్నారు. గురువారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయం 5వ బ్లాక్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన 6వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ రెండవ రోజు సమావేశంలో నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల మాట్లాడుతూ… జిల్లాలో వేసైడ్ అమెనిటీస్ ఏర్పాటు చేయడానికి పెట్టుబడిదారుల నుంచి గణనీయమైన ఆసక్తి వ్యక్తమవుతోందని తెలిపారు. రోడ్డు పక్కన, ముఖ్యంగా జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల వెంబడి ఈవే సైడ్ సౌకర్యాల నిర్మాణానికి భూములను కొనుగోలు చేయాలని కొంతమంది పెట్టుబడిదారులు ముందుకు వస్తున్నారని, ఇప్పటికే కొన్ని అనుకూల స్థలాలను కూడా గుర్తించినట్లు ఆయన వివరించారు. ఈ ప్రాజెక్టుల్లో ప్రయాణికులకు సౌకర్యంగా ఫుడ్ కోర్టులు, పెట్రోల్ బంకులు, ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలకు EV ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు ఉన్నాయని చెప్పారు. అదనంగా ప్రజలకు వినోదాన్ని అందించే విధంగా ఫన్ పార్క్ ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా ఉందని తెలిపారు.

అయితే ప్రస్తుతం ఈ ప్రాజెక్టుల్లో వసతి గదులు ఏర్పాటు చేసే ప్రణాళిక లేదని కలెక్టర్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (APIIC) ద్వారా ప్రాసెస్ చేయాలా, లేక ఆంధ్రప్రదేశ్ టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా ప్రాసెస్ చేయాలా అన్న దానిపై కలెక్టర్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే పశు భీమా యోజన పథకం కింద జిల్లాకు కేటాయించిన నిధులను రూ.11 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచాలని జిల్లా కలెక్టర్ కోరగా, వెంటనే ముఖ్యమంత్రి ఆ ప్రతిపాదనను ఆమోదిస్తూ రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని సూచించారు.

Read Previous

కిడ్నీ వ్యాధులపై అప్రమత్తత అవసరం : అపోలో వైద్యుల హెచ్చరిక

Read Next

నెల్లూరుజిల్లాలో సాగర్ డిఫెన్స్ ప్రాజెక్ట్ : శంఖుస్థాపన చేసిన మంత్రి లోకేష్

Leave a Reply

Your email address will not be published.