Clock Of Nellore ( Kandukur ) – కందుకూరు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే మానుగుంట మహిధర్ రెడ్డికి టికెట్ ను నిరాకరించడంతో గత కొద్ది రోజులుగా పార్టీ వ్యవహారాలకు ఆయన దూరంగా ఉన్నారు. ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటూ టిడిపిలోని ముఖ్య నేతలు ఆయన్ను కలిసి టిడిపిలోకి రావాలని ఆహ్వానించారు. ఆయన టిడిపిలోకి వెళ్తారని ప్రచారం సాగుతుంది. ఈ నేపద్యంలో శనివారం వైసీపిలో కీలక నేత విజయసాయి రెడ్డి రంగంలోకి దిగారు. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎంపిలు ఆదాల ప్రభాకర్ రెడ్డి, బీదా మస్తాన్ రావుతో కలిసి మహిధర్ రెడ్డిని కలిశారు. మాచవరంలోని వారి నివాసానికి వెళ్లిన విజయసాయి రెడ్డికి మహిధర్ రెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. పార్టీని వీడవద్దని కోరినట్లు సమాచారం. దానికి మహిధర్ రెడ్డి అంగీకరించినట్లు తెలిసింది. అలాగే కందుకూరు వైసీపి అభ్యర్ధి బుర్రా మధుసూదన్ యాదవ్ విజయానికి సహకరించాలని కోరారు. అలాగే త్వరలో జరిగే సిద్ధం సభకు రావాలని కోరినట్లు తెలిసింది. ఈ భేటీలో కందుకూరు అభ్యర్ధి మధుసూదన్ యాదవ్ కూడా ఉన్నారు.
