Clock Of Nellore ( Nellore ) – త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరుజిల్లాలోని పదికి పది అసెంబ్లీ సీట్లను, రెండు పార్లమెంటు సీట్లను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతుందని మాజీ మంత్రి, నెల్లూరు నగర టిడిపి అభ్యర్ధి పొంగూరు నారాయణ ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ చంద్రబాబు ప్రకటించిన అభ్యర్ధుల తొలి జాబితాలో నెల్లూరు సిటీ అభ్యర్ధిగా నారాయణ పేరును ప్రకటించిన నేపద్యంలో ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. మొదటి జాబితాలోనే తన పేరును ప్రకటించినందుకు టిడిపి అధినేత చంద్రబాబుకు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరుజిల్లాలోని అన్నీ స్థానాలను తెలుగుదేశం – జనసేన కూటమి కైవసం చేసుకుంటుందని, ఆ దిశగా తామంతా ఉమ్మడి కార్యాచరణతో ముందుకెళ్తామన్నారు. ప్రజలు ఎంతో నమ్మకంతో గత ఎన్నికల్లో వైసీపికి అవకాశం కల్పించారని, అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ నమ్మకాన్ని వమ్ము చేశారని, ఫలితంగా నేడు ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే మొట్ట మొదటగా నెల్లూరులో పెండింగ్ లో ఉన్న అన్నీ పనులను పూర్తి చేస్తానని, నిరుపేదలందరికీ సొంతింటి కలను నెరవేరుస్తానని నారాయణ హామీ ఇచ్చారు.