Clock Of Nellore ( Nellore ) – మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ధనదాహంతో వేల మందికి ఉపాధి కల్పించే కృష్ణపట్నం పోర్టు నిర్వహణ గాల్లో దీపంలా మారిందని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం పోర్టుకు వచ్చింది ఖాళీ కంటైనర్ల వెజలేనని వెల్లడించారు. కేరళలోని అదానీకి చెందిన పోర్టులో రద్దీ కారణంగా ఖాళీ కంటైనర్లను కృష్ణపట్నం పోర్టుకు తీసుకువచ్చారని సోమిరెడ్డి వెల్లడించారు. శనివారం నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో సోమిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఇప్పటికే ఉపాధి కోల్పోయిన 10వేల కుటుంబాలకు నిన్న వచ్చిన ఖాళీ కంటైనర్లతో ఉపయోగం శూన్యమని పేర్కొన్నారు. కంటైనర్ టెర్మినల్ ఎక్కడికి పోలేదని చెబుతున్న మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి… ఫిబ్రవరి నెలకు సంభందించిన వెజల్స్ షెడ్యూల్ ను ఈ రోజుకీ విడుదల చేయలేదని గుర్తు చేశారు. అంటే కంటైనర్ టెర్మినల్ మూతబడ్డట్టే కదా అని సూచించారు. మంత్రి కాకాణి ఏనాడు నిజాలు చెప్పలేదని, ఆయన ఐరెన్ లెగ్ అని విమర్శించారు. మంత్రి అయిన రోజు నుంచే వైసిపి పతనం మొదలైందని, ఆపార్టీలో రోజుకో వికెట్ పడుతుందని పేర్కొన్నారు. ఎన్నికల్లోగా వైసిపి మూతపడబోతుందని సోమిరెడ్డి విమర్శించారు.