Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులోని ఏ.సి సుబ్బారెడ్డి క్రీడా మైదానం, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, కొండాయపాలెం గేటు కూడలి తదితర ప్రధాన మార్గాలలోని డివైడర్ల సుందరీకరణ పనులను బుధవారం నగర మేయర్ పోట్లూరి స్రవంతి తనిఖీ చేశారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ అధికారులకు పలు సూచనలు చేశారు. అభివృద్ది కార్యక్రమాల్లో భాగంగా నగర వ్యాప్తంగా చేపడుతున్న సుందరీకరణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణ, నగర సుందరీకరణలలో డివైడర్లు ప్రధాన భాగమని, డివైడర్లను ఆధునీకరించి అన్ని ప్రధాన మార్గాలలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు అనుకూలమైన మొక్కలను నాటి, వాటిని సంరక్షించాలని అధికారులకు సూచించారు. ఆర్టీసి ప్రధాన బస్టాండు కూడలి నుంచి స్థానిక కె.వి.ఆర్ పెట్రోల్ బంకు కూడలి వరకు జరుగుతున్న డివైడర్ల సుందరీకరణ పనులను తగిన నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసి ప్రజలకు త్వరలో అందుబాటులోకి తేనున్నామని మేయర్ వెల్లడించారు. నగరపాలక సంస్థలోని అన్ని ప్రధాన మార్గాలలో అవసరమైన చోట నూతన డివైడర్ల ఏర్పాటు, డివైడర్ల ఆధునీకీకరణ పనులు, డివైడర్ల సుందరీకరణ కార్యక్రమాలను ప్రణాళికా బద్దంగా నిర్వహించేందుకు ప్రతిపాదనలను సిద్దం చేయాలని మేయర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమం లో 27 వ డివిజన్ కార్పొరేటర్ మురహరి, 28 వ డివిజన్ ఇంచార్జి చెక్కా సాయి సునీల్, 33 వ డివిజన్ ఇంచార్జి హజరత్ నాయుడు, అళహరి విజయ్, మునిసిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Reporter – P. Eswar