Clock Of Nellore ( Kavali ) – తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర మరో మైలురాయిని చేరుకుంది. జనవరి 27న కుప్పం నుంచి ప్రారంభించిన పాదయాత్ర మంగళవారం నెల్లూరు జిల్లాలో 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. కావలి నియోజకవర్గంలో కొనసాగుతున్న లోకేష్ పాదయాత్ర మంగళవారం ఉదయం కావలి మండలం, కొత్తపాళెంకు చేరుకుంది. కొత్తపాళెంలో మహిళలతో లోకేష్ రచ్చబండ కార్యక్రమం నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టిడిపి అధికారంలోకి రాగానే సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం అదే గ్రామ సమీపంలో పాదయాత్ర 2000 కిలోమీటర్లు పూర్తయింది. దీంతో అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని లోకేష్ ఆవిష్కరించారు. అంతే కాకుండా టిడిపి అధికారంలోకి రాగానే అదే గ్రామంలో ఫిషరీస్ డెవలప్ మెంట్ బోర్డు కార్యాలయాన్ని ప్రారంభిస్తామంటూ మరో శిలాఫలకాన్ని కూడా లోకేష్ ఆవిష్కరించారు. 400 రోజులు, 4వేల కిలోమీటర్ల పాదయాత్రలో భాగంగా 2వేల కిలోమీటర్ల మైలు రాయిని నెల్లూరుజిల్లాలో పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా లోకేష్ అన్నారు. ఇవాళ రాత్రి పాదయాత్ర ఉదయగిరి నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది.
