రంజాన్ మాసం ఏర్పాట్లపై మేయర్ స్రవంతి అధికారులతో సమీక్ష

Clock Of Nellore ( Nellore ) – ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ మాసం ఈ నెల 24వ తేదీన మొదలు కానుండడంతో నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ స్రవంతి… కమీషనర్ హరిత తో కలిసి నగర వ్యాప్తంగా ఉన్న అన్ని మసీదుల వద్ద ఏర్పాటు చేయాల్సిన ప్రత్యేక సౌకర్యాలపై కార్పోరేషన్ అధికారులతో సోమవారం సాయంత్రం మేయర్ ఛాంబర్ నందు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ముస్లింలు పరమ పవిత్రంగా భావించే రంజాన్ మాసంను పురస్కరించుకుని నెల్లూరు నగరవ్యాప్తంగా అన్ని డివిజన్లలో ఉన్న మసీదుల వద్ద ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. నెల్లూరు రూరల్ శాసన సభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రంజాన్ మాసం సందర్భంగా ఏర్పాటు చేసే ప్రత్యేక సౌకర్యాలపై దృష్టి సారించాలని తెలిపినట్లు మేయర్ పేర్కొన్నారు. ముస్లింలు ఎక్కువగా నివసించే డివిజన్లలో నెల రోజులపాటు తాగునీరు, వాడకపు నీరును తెల్లవారుజామున, సాయంత్రం అంతరాయం లేకుండా సరఫరా చేయాలని, మసీదుల సమీపంలో నీటి డ్రమ్ములు, అవసరమైన చోట వాటర్ ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా చేయాలని, విద్యుత్తుకు అంతరాయం లేకుండా, నగర వ్యాప్తంగా అన్ని డివిజన్లలోని మసీదుల సమీపంలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని, అవసరమైన మసీదుల వద్ద మొబైల్ టాయిలెట్స్, డస్ట్ బిన్స్ ఏర్పాటు చేసి నిరంతరం పారిశుధ్య నిర్వహణ చేపట్టాలని మేయర్ అధికారులకు సూచించారు. నగరంలోని అన్ని మసీదుల వద్ద ప్రత్యేక పారిశుధ్య నిర్వహణలో భాగంగా సున్నం, బ్లీచింగ్ చల్లడం, డ్రెయిన్ కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం, అన్ని మసీదుల దగ్గర కుక్కలు, పందులు, పశువుల సంచారాన్ని నియంత్రించాలని మేయర్ అధికారులకు తెలియజేశారు. ఈ సమీక్షా సమావేశంలో ఇంజనీరింగ్ విభాగం అధికారులు, ప్రజారోగ్య విభాగం అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Read Previous

నెల్లూరు అపోలో హాస్పిటల్ లో అందుబాటులో కొచ్చిన DEXA స్కానింగ్ మిషన్

Read Next

విద్యార్ధులకు రాగి జావ : నెల్లూరులో పథకాన్ని ప్రారంభించిన జడ్పీ ఛైర్ పర్సన్ అరుణమ్మ

Leave a Reply

Your email address will not be published.