Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ వైసీపి తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తన ఫోన్ ట్యాపింగ్ అయిందని కోటంరెడ్డి చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని, ఈ విషయాన్ని ఆయన స్నేహితుడు రామశివారెడ్డి స్పష్టం చేశారని పేర్కొన్నారు. ప్రభుత్వంపై బురద జల్లడమే లక్ష్యంగా కోటంరెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తనకు అండగా నిలిచిన పార్టీకి ద్రోహం చేశాడని, అందుకే కోటంరెడ్డికి ఊహించని ఎదురుదెబ్బలు తగులుతున్నాయని మంత్రి కాకాణి వ్యాఖ్యానించారు. గురువారం నెల్లూరులోని రూరల్ వైసీపి ఇంఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి నివాసంలో మంత్రి కాకాణి మీడియాతో మాట్లాడారు. కోటంరెడ్డి చెప్పేవన్నీ పచ్చి అబద్దాలని, రికార్డ్ చేసిన ఆడియోను ట్యాపింగ్ గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అది ఫోన్ ట్యాపింగ్ కాదని, చంద్రబాబు ట్రాప్ అంటూ ట్యాపింగ్ అయితే కోర్టుకు ఎందుకు వెళ్లలేదని కోటంరెడ్డిని ప్రశ్నించారు. రూరల్ నియోజకవర్గ పరిధిలోని కార్పొరేటర్లు, సర్పంచ్ లు, ఎంపిటిసీలు, నేతలు, కార్యకర్తలంతా వైసీపితోనే ఉన్నారని మంత్రి స్పష్టం చేశారు.
