Clock Of Nellore ( Saudi ) – సౌదీ అరేబియా జాతీయ క్రీడల చరిత్రలో తొలిసారిగా నెల్లూరు కుర్రోడు సత్తా చాటి స్వర్ణ పతకాన్ని అందుకున్నాడు. బ్యాడ్మింటన్ బాలుర విభాగంలో 17 ఏళ్ల మహాద్ స్వర్ణ పతకం సాధించి సౌదీ ఒలింపిక్ కమిటి ఉపాధ్యక్షులు, సౌదీ క్రీడల డైరెక్టర్ ప్రిన్స్ ఫహాద్ బిన్ జలవీ బిన్ అబ్ధుల్ అజీజ్ చేతుల మీదుగా స్వర్ణ పతకం అందుకున్నాడు. అలాగే పారితోషికం కింద ఒక మిలియన్ రియాల్స్ ( సుమారు రూ. 2,18,60,000 ) నగదు బహుమతిని కూడా పొందాడు. నెల్లూరు నగరంలోని రామలింగాపురంకు చెందిన షేక్ షాహిద్, షాకిరా బేగం కుమారుడైన మహాద్, ప్రస్తుతం రియాద్ నగరంలోని భారతీయ ఎన్. ఎం. ఎస్. ఈ విద్యా సంస్థలో 11వ తరగతి చదువుతున్నాడు. ఈ సందర్భంగా మహాద్ మాట్లాడుతూ తాను హైదరాబాద్ లోని గోపిచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ పొంది ఎన్నో మెళుకువలు నేర్చుకున్నానని, ఆ శిక్షణే తన విజయానికి దోహదపడిందని పేర్కొన్నారు. సౌదీ అరేబియా తరపున ఒలంపిక్ క్రీడల్లో పాల్గొని విజయం సాధించడమే తన లక్ష్యమన్నారు.