Clock Of Nellore ( Nellore ) – జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. పవన్ పొలిటికల్ బ్రోకర్ లా విన్యాసాలు చేస్తున్నాడని, చంద్రబాబు స్నేహంతో పవన్ కి కూడా మతి మరుపు రోగం వచ్చినట్టుందని ఎద్దేవా చేశారు. నెల్లూరులోని వైసీపి జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో హీరో కావొచ్చు కానీ, రాజకీయాల్లో జీరో అంటూ దుయ్యబట్టారు.
ప్యాకేజీల పవన్ గా రాష్ట్ర ప్రజలు ఎప్పుడో గుర్తించారని, ఒక్క చోట కూడా పవన్ కళ్యాణ్ ను ప్రజలు గెలిపించలేదన్నారు. చంద్రబాబుకి సుపుత్రుడిపై నమ్మకం లేదని, దత్తపుత్రుడైన పవన్ ను అడ్డం పెట్టుకుని లబ్ధిపొందాలని చూస్తున్నాడన్నారు. 2024లో కుప్పంలో చంద్రబాబుకి ఓటమి తప్పదన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లాలూచీ వల్ల ఒరిగేదేమీ లేదని, వారి మధ్య రహస్య ఒప్పందం జగమెరిగిన సత్యం అని పేర్కొన్నారు. సంక్షేమ సారధి వైఎస్ జగన్ ను విమర్శించే అర్హత పవన్ కళ్యాణ్ లేదని గుర్తు చేశారు. రాజకీయ ఓనమాలు రాని పవన్ గాలికి కొట్టుకుపోతాడని, పరిజ్ఞానం లేకుండా మాట్లాడటం హాస్యాస్పదం, పవన్ ను విడిచిపెట్టేది లేదని కాకాణి హెచ్చరించారు.