Clock Of Nellore ( Nellore ) – ప్రియుడు తనకు దక్కడన్న అనుమానంతో ప్రియురాలు అతని గొంతు కోసిన ఘటన నెల్లూరుజిల్లాలో చోటుచేసుకుంది. ప్రియుడు చనిపోయిన తర్వాత తానూ గొంతు కోసుకుని చనిపోయాలని నిర్ణయించుకున్నట్లు తర్వాత ఆమె వెల్లడించింది. వివరాల్లో కెళ్తే… నెల్లూరు రూరల్ మండలం, సౌత్ మోపూరు గ్రామానికి చెందిన ప్రసన్న కుమార్ అనే వ్యక్తికి… ఉమ్మడి నెల్లూరుజిల్లాలోని చిట్టమూరు మండలం, మల్లాంకు చెందిన లక్ష్మీ ప్రసన్న ఫోన్ లో పరిచయం అయింది. లక్ష్మీ ప్రసన్నకు అప్పటికే పెళ్లయి ఓ బిడ్డ ఉండగా, ప్రసన్న కుమార్ కు ఇంకా పెళ్లి కాలేదు. భర్త తన వద్ద లేడని చెప్పడంతో ఇద్దరూ ఇష్టపడి సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో వీరికి ఓ బిడ్డ కూడా పట్టాడు. వివిధ ప్రాంతాల్లో నివాసం ఉంటూ ప్రస్తుతం సౌత్ మోపూరులో ఉంటున్నారు. ఇటీవల వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. ప్రసన్న కుమార్ కుటుంబంతో లక్ష్మి ప్రసన్నకు గొడవలు జరిగాయి.
ఈ నేపద్యంలో ప్రసన్న కుమార్ కు వారి తల్లిదండ్రులు పెళ్లి చేస్తారని అనుమానించిన లక్ష్మీ ప్రసన్న ఇవాళ సౌత్ మోపూరులో చాకుతో ప్రసన్నకుమార్ గొంతు కోసింది. తీవ్రంగా రక్త స్రావం కావడంతో ఆమె అతన్ని నెల్లూరులో ప్రభుత్వ వైద్యశాలకు తీసుకొచ్చింది. విషయం తెలుసుకున్న ప్రసన్న కుమార్ కుటుంబసభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే దీనిపై లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ ప్రసన్న కుమార్ కు వారి కుటుంబసభ్యులు మరో పెళ్లి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అతను కూడా తనను పట్టించుకోవడం లేదని, ప్రసన్న కుమార్ లేకపోతే తాను బ్రతకలేనని అందుకే అతన్ని హత్య చేసి తానూ ఆత్మహత్య చేసుకోవాలనే ఈ చర్యకు పాల్పడినట్లు తెలిపింది. నెల్లూరు రూరల్ పోలీసులు ఆసుపత్రికి చేరుకుని లక్ష్మీ ప్రసన్నను అదుపులోకి తీసుకున్నారు. ప్రసన్న కుమార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.