Clock Of Nellore ( Kota ) – ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని కోట మండలం, విద్యానగర్ లో ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. స్థానిక ప్రకాశం కాలనీకి చెందిన లోకేష్, అంజలి అనే ఇద్దరూ గతంలో ఆదిశంకర కళాశాలలో చదివారు. చదువుకునే క్రమంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. లోకేష్ చుదువు మధ్యలో ఆపేసి వరికోత మిషన్ ఆపరేటర్ గా పనిచేస్తుండగా, అంజలి మాత్రం చదువు పూర్తి చేసి చెన్నైలో ప్రైవేటు ఉద్యోగం చేస్తుంది. దూరంగా ఉన్నా వారి ప్రేమ మాత్రం కొనసాగింది. ఈ క్రమంలో ఇరు కుటుంబాల మధ్య పెళ్లి చర్చలు జరగ్గా, అబ్బాయి వయసు కంటే అమ్మాయి వయస్సు మూడేళ్లు అధికంగా ఉందంటూ అబ్బాయి తల్లిదండ్రులు పెళ్లికి అభ్యంతరం తెలిపారు. అయితే లోకేష్ మాత్రం ఒప్పుకోలేదు. మూడు రోజుల క్రితం అంజలిని వారింటికి తీసుకెళ్లాడు. దీనికి వారి తల్లిదండ్రులు అభ్యంతరం తెలిపి అమ్మాయిని వారింటికి పంపాలని తేల్చిచెప్పారు. దీంతో మనస్థాపం చెందిన ఇద్దరూ ఇవాళ ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగారు. అపస్మారక స్థితిలో ఉన్న ఇద్దర్నీ చుట్టుపక్కల వారు గమనించి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.