సంగం బ్యారేజీని ప్రారంభించిన సిఎం జగన్ – ఎంతో గర్వంగా ఉందని వెల్లడి

Clock Of Nellore ( Sangam ) – ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా సంగం వద్ద పెన్నానదిపై నిర్మించిన మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీని మేకపాటి కుబుంబ సభ్యులతో కలిసి ప్రారంభించారు. అలాగే బ్యారేజీ వద్ద ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్‌ ప్రసంగించారు. ఐదు లక్షలు ఎకరాలకు.. ఆత్మకూరు, కోవూరు, కావలి నియోజక వర్గాలకు మేలు చేకూరే విధంగా ఈ ప్రాజెక్ట్ ప్రారంభించామని సీఎం జగన్‌ తెలిపారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయి. గత మూడున్నర ఏళ్లుగా ఒక మండలం కూడా కరువు మండలంగా ప్రకటించలేదు అని పేర్కొన్నారు. సంగం, నెల్లూరు బ్యారేజీ ప్రాజెక్ట్‌లను రూ.320 కోట్లతో పూర్తి చేసినట్లు వివరించారు.

”సంగం ప్రాజెక్ట్‌ను ప్రాధాన్యత ప్రాజెక్ట్‌గా వేగం పెంచాం, పూర్తి చేశాం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడిగా ఈ ప్రాజెక్ట్‌లు పూర్తి చేసినందుకు గర్వ పడుతున్నా. నాన్నగారి హయాంలో ప్రారంభిస్తే, ఆయన మరణం తర్వాత నిర్లక్ష్యం చేశారు. గత ప్రభుత్వం సంగం బ్యారేజి కోసం రూ.30 కోట్ల 5 లక్షలు మాత్రమే ఖర్చు చేశారు. బాబు హయాంలో కమీషన్లు దండు కోవడమే వాళ్లు చేశారు. సంగం ప్రాజెక్టుకు మన ప్రభుత్వంలో రూ.200 కోట్లు ఖర్చు చేశాం. కోవిడ్ సమస్య, వరద సమస్య ఉన్న మూడేళ్లలో పూర్తి చేశాం. స్నేహితుడు మేకపాటి గౌతం రెడ్డి పేరు పెట్టాం. హఠాన్మరణంతో గౌతమ్ మనకు దూరం అయ్యాడు. సంగం బ్యారేజికి మేకపాటి గౌతం రెడ్డి పేరు పెట్టాం. గౌతం సంస్మరణ సభలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా. 3లక్షల 85 వేల ఎకరాలు అయకటు స్థిరీకరణ జరుగుతోంది. నెల్లూరు ప్రాజెక్ట్ రూ.147 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభిస్తే.. రూ.86 కోట్లు ఖర్చు చేశారు.. ఆయన మరణం తర్వాత వాటిని పట్టించు కోలేదు. జలయజ్ఞంలో పెట్టిన 26 ప్రాజెక్ట్‌లు ప్రాధాన్యత క్రమంలో తీసుకుని ప్రతి ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం” అని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

Read Previous

కోటంరెడ్డి ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జనాల సందడి : ఆకట్టుకున్న ఆథ్యాత్మిక కార్యక్రమాలు

Read Next

నెల్లూరు బ్యారేజీని ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్…

Leave a Reply

Your email address will not be published.