Clock Of Nellore ( Nellore ) – చిన్న చిన్న కారణాలతో పలు ప్రభుత్వ పథకాలను అర్హులకు దూరం చేస్తున్నారని జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. పవనన్న ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా 111 రోజైన ఆదివారం నెల్లూరులోని 13వ డివిజన్ లో ఆయన పర్యటించారు. బాలాజీనగర్, మైత్రీ వాటర్ ప్లాంట్ ప్రాంతాల్లోని గడప గడపకు వెళ్లిన కేతంరెడ్డి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా పలువురు మహిళలు చేయూత పథకం తమకు రద్దు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

అనంతరం కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ కరెంటు బిల్లును సాకుగా చూపి పథకాలను ప్రజలకు దూరం చేయడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. ఉమ్మడి కుటుంబాల్లో కరెంటు వినియోగం 300 యూనిట్లు దాటం సహజమేనని, ఆ కారణాన్ని చూపి పథకాన్ని నిలిపివేయడం దారుణమన్నారు. జగన్ ప్రభుత్వంలో పథకాలు పొందాలంటే కుటుంబసభ్యులకు దూరంగా ఉండాలా అని ప్రశ్నించారు. చేయూత పథకం ద్వారా ఒక్కో మహిళకు నాలుగు సంవత్సరాల్లో ఒక్కో ఏడాది 18వేలా 750 రూపాయల చొప్పున మొత్తం 75వేల రూపాయలు ఇస్తామన్న ముఖ్యమంత్రి, అనేక మంది తొలి సంవత్సరం నగదు జమ చేసి తర్వాత నుండి నిలిపివేసిందని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా జనసేన పార్టీని గెలిపించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని కేతంరెడ్డి స్పష్టం చేశారు.
