Clock Of Nellore ( Vinjamuru ) – నెల్లూరుజిల్లా వింజమూరు పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. ఏం కష్టమొచ్చిందో ఏమో తెలియదు గానీ తల్లి తన ఇద్దరు బిడ్డలకు ఉరి వేసి, తాను కూడా ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. వింజమూరులోని జైభీమ్ నగర్ లో సాదం వెంకట్రావ్, గీత దంపతులు నివసిస్తున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. కుమారుడు వెంకట్ ( 10 ), కుమార్తె చరిష్మా ( 5 ) ఉన్నారు. వెంకట్రావ్ స్థానిక గ్యాస్ గోదాంలో గుమస్తాగా పనిచేస్తుంటాడు. పని నిమిత్తం ఇవాళ ఉదయం గ్యాస్ గోదాంకు వెంకట్రావ్ వెళ్లాడు. మధ్యాహ్నం తిరిగి ఇంటికి వచ్చి చూడగా భార్య గీత, కుమారుడు, కుమార్తె ఉరి వేసుకుని ఉండగా నిర్ఘాంతపోయాడు. స్థానికులకు విషయాన్ని తెలియజేయగా అందరూ వచ్చి ఉరి తీసి వారికి మంచంపై పడుకోబెట్టారు. అప్పటికే వారు చనిపోయి ఉన్నారు. ఇద్దరు పిల్లలకు ఉరి వేసి తర్వాత తాను కూడా ఉరివేసుకున్నట్లు అర్ధమవుతుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.