Clock Of Nellore ( Atmakur ) – నెల్లూరుజిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు మంగళవారం ఆత్మకూరులో విస్త్రృతంగా పర్యటించారు. గ్రామ సచివాలయాలను తనిఖీ చేయడంతో పాటూ జగనన్న లే అవుట్లలో ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ముందుగా ఆయన నెల్లూరు పాళెం సచివాలయాన్ని తనిఖీ చేశారు. సచివాలయాల్లో ఎలాంటి ధరఖాస్తులు పెండింగ్ లో లేకుండా సత్వరమే పరిష్కరించాలని, సర్వీసులకు సంభందించిన అన్నీ రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన అనేక రకాల పౌర సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని సూచించారు. ఈ తనిఖీలో ఆయనతో పాటూ ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ రమేష్, ఆర్డీఓ కరుణ కుమారి పాల్గొన్నారు.

అనంతరం కలెక్టర్ ఆత్మకూరు సమీపంలోని పమిడిపాడు, నెల్లూరుపాళెంలో ఉన్న జగనన్న లే అవుట్లను పరిశీలించారు. సెప్టెంబర్ నెలాఖరులోగా ఇళ్ల నిర్మాణాలు బేస్మెంట్ స్థాయి దాటాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులకు అవసరమైన అన్నీ మౌలిక సదుపాయాలు కల్పించి, నిర్మాణాలు త్వరితగతిన పూర్తయ్యేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటూ హౌసింగ్ పిడి రంగ వరప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
