Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు మైపాడు రోడ్డులో జాఫర్ సాహెబ్ కెనాల్ పక్కన ఆక్రమణల తొలగింపును కొంత మంది కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని, ఒక వేళ నిజంగా ఇల్లు కోల్పోయిన బాధితులకు ఖచ్చితంగా ప్రత్యామ్నాయ స్థలాల్లో వారికి ఇల్లు నిర్మించి ఇస్తామని నెల్లూరు నగర ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. పాత చెక్ పోస్టు నుండి మైపాడు గేటు వరకూ కాలువ పక్కనే ఉన్నవన్నీ ఇళ్లు కాదని అక్కడి వారంతా వ్యాపారాలు చేసుకునే వారని వెల్లడించారు. నవాబుపేటలోని బివిఎస్ బాలికల హైస్కూల్ అభివృద్ధి పనులకు ఆయన శంఖుస్థాపన చేసిన అనంతరం దానిపై మాట్లాడారు. మైపాడు రోడ్డులో నిజంగా ఎవరైనా నివాస గృహం కోల్పోతే వారికి ఖచ్చితంగా ఇల్లు నిర్మించి ఇస్తామని వెల్లడించారు. బివిఎస్ బాలికల హైస్కూల్ ను 3.5 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని తెలియజేశారు. నగరంలో మొత్తం 50 కోట్ల రూపాయలతో పాఠశాలలకు కొత్త రూపు తీసుకొచ్చామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్, కార్పొరేటర్లు కిన్నెర మాల్యాద్రి, మొగళ్లపల్లి కామాక్షిదేవి, మద్దినేని మస్తానమ్మ, ముదిరాజ్ కార్పొరేషన్ ఛైర్మైన్ నారాయణ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
