Clock Of Nellore ( Nellore ) – ప్రభుత్వ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలందించడంలో జిల్లా రెడ్ క్రాస్ సంస్థ కీలక పాత్ర పోషిస్తుందని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు పేర్కొన్నారు. శనివారం నెల్లూరులోని రెడ్ క్రాస్ సంస్థ కార్యాలయంలో రాజ్మల్ కేమ్ భండారి ఫౌండేషన్ రాయచూర్, భగవాన్ మహావీర్ వికలాంగుల సహాయతా సమితి, జైపూర్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత కృత్రిమ అవయవ స్క్రీనింగ్ మరియు కొలతల క్యాంపు కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిధిగా పాల్గొని, దివ్యాంగులకు కృత్రిమ కాలు, చేయి ఏర్పాటు నిమిత్తం చేపడుతున్న స్క్రీనింగ్ మరియు కొలతల కార్యక్రమాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సంస్థ వ్యవస్థాపకులు జాన్ హెన్రి డ్యూనంట్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గత రెండు సంత్సరాల నుండి ప్రజలకు సేవలు అందించడంలో జిల్లా రెడ్ క్రాస్ సంస్థ ముందుండి ముఖ్యంగా కోవిడ్ సమయంలో ప్రభుత్వ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలందించడంలో జిల్లా రెడ్ క్రాస్ ఎనలేని పాత్ర పోషించిందన్నారు. కోవిడ్ సమయంలో ప్లాస్మా సేకరణలో గాని, ఆక్సిజన్ అందించడంలో గాని, ఎన్నో వైద్య పరమైన సేవలందించడంలో దేశంలో జిల్లా రెడ్ క్రాస్ సంస్థ మొదటి స్థానంలో నిలిచిందన్నారు. కోవిడ్ సమయంలో కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా కోవిడ్ బాధితులకు ఎనలేని సేవలందించడం జరిగిందన్నారు. ఏ జిల్లాలో లేని విధంగా అధునాతన సౌక్యరాలతో మన జిల్లాలో క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ ను రెడ్ క్రాస్ సంస్థ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.

ఇటీవలే రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ ను ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. ఈ కృత్రిమ అవయవాలు ఏర్పాటు క్యాంపులో సుమారు 500 పైబడి తమ పేర్లను నమోదు చేసుకోవడం జరిగిందని, కృత్రిమ కాలు, చేయి ఏర్పాటు వలన వారి దైనందిన జీవితంలో ఆత్మస్థైర్యంతో జీవిస్తూ తమ కాళ్లపై తాము నిలబడి జీవించేందుకు అవకాశం వుంటుందన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో బాగంగా జిల్లాలో నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించడం, పేదలకు జీవన ప్రమాణాలు మెరుగుపడేలా యూనిట్స్ గౌండింగ్ చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుచున్నదన్నారు. అలాగే ఆగష్టు 13 నుండి 15 వరకు ఇంటింటా జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని, ప్రతి ఇంటా మువ్వన్నెల జండా కార్యక్రమం వలన భక్తి శ్రద్దలతో దేశ భక్తిని మరింత పెంచుతుందన్నారు. జిల్లాలో 8.80 లక్షల కుటుంబాలకు జాతీయ జెండాను ఇవ్వడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సంస్థ, ఇతర స్వచ్చంద సంస్థలు భాగస్వాములు కావాలని కోరారు. జిల్లాలో 60 వేల మంది దివ్యాంగులకు ప్రత్యేక యూనిక్ నెంబర్ తో గుర్తింపు కార్డులు జారీ చేయడం జరుగుతుందని, ఈ కార్డు వలన ప్రభుత్వ పధకాలు వారికి అందుతాయని కలెక్టర్ తెలిపారు. ఇప్పటి వరకు 48 వేల మందికి ప్రత్యేక గుర్తింపు కార్డులను జారీ చేయడం జరిగిందని, మిగిలిన వారికి కూడా ప్రత్యేక గుర్తింపు కార్డులు అందచేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ సంస్థ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, ఉపాధ్యక్షులు దామిశెట్టి సురేశ్ నాయుడు, కో కన్వీనర్ డా. రవి కుమార్, జిల్లా రెడ్ క్రాస్ సంస్థ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
