Clock Of Nellore ( Nellore ) – భారీ వర్షాలు, తదితర కారణాల వల్ల అధ్వాన్నంగా మారిన రోడ్లను అందంగా తీర్చిదిద్దుతున్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఏ నియోజకవర్గంలో లేని విధంగా నెల్లూరు రూరల్ లో రోడ్లకు మహర్ధశను కల్పించారు ఆయన. నియోజకవర్గం మొత్తం 62 కోట్ల రూపాయల వ్యయంతో రోడ్ల నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఇప్పటికే కొన్ని పూర్తి కాగా, కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. మిగిలినవి శర వేగంగా ప్రారంభిస్తున్నారు. తాజాగా సోమవారం నెల్లూరు హరనాథపురం నుండి మాదరాజు గూడూరు వరకూ 8 కోట్ల రూపాయలతో నిర్మించనున్న రోడ్డు పనులను ఎమ్మెల్యే కోటంరెడ్డి ప్రారంభించారు. నగరంలోని అపోలో హాస్పిటల్ సెంటర్ వద్ద నగర మేయర్ స్రవంతి, వైసీపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డితో కలిసి నిర్మాణ పనులు ఆరంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకారంతో నెల్లూరు రూరల్ లో అందమైన రోడ్లకు శ్రీకారం చుట్టామన్నారు. నియోజకవర్గం మొత్తం 62 కోట్ల రూపాయలతో రోడ్లను నిర్మిస్తున్నామని, స్థానిక ఎమ్మెల్యేగా శక్తికి మించి అభివృద్ధి చేస్తున్నానని పేర్కొన్నారు. డైకాస్ రోడ్డు నుండి కొత్తూరు వరకు 9 కోట్ల రూపాయలు, నెల్లూరు నుండి మైపాడు వరకు 2.10 కోట్ల రూపాయలు, హరనాధపురం నుండి మాదరాజుగూడూరు వరకు 8 కోట్ల రూపాయలు, అన్నమయ్య సర్కిల్ నుండి జాతీయ రహదారి వరకు 2.01 కోట్ల రూపాయలు, మొగళ్ల పాలెం మరియు సౌత్ మోపూరు వరకు 2.80 కోట్ల రూపాయలు, పెనుబర్తి మీదుగా కలివెలపాళెం వరకు 2.15 కోట్ల రూపాయలు, అల్లీపురం రోడ్డు కు 10 కోట్ల రూపాయలు, డి.కే. కాలేజ్ నుండి డైకాస్ రోడ్డు వరకు 4.5 కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో 17, 18వ డివిజన్ల కార్పొరేటర్లు పేనేటి సుధాకర్, అశోక్, కో – ఆప్షన్ సభ్యురాలు హురియా తదితరులు పాల్గొన్నారు.
