Clock Of Nellore ( Nellore ) – ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని అలాంటి వారికి ప్రభుత్వం అన్యాయం చేయడం దురదృష్ఠకరమని జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి అన్నారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సిపిఎస్ ను రద్దు చేస్తామని ఆయన వెల్లడించారు. పవనన్న ప్రజాబాటలో భాగంగా 29వ రోజైన మంగళవారం ఆయన నెల్లూరు మైపాడురోడ్డులోని శ్రీనివాస నగర్ లో పర్యటించారు. ఈ సందర్భంగా గడప గడపకు తిరుగుతూ రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే ప్రజలకు అన్నీ విధాలా మేలు కలుగుతుందని వెల్లడించారు. అనంతరం కేతంరెడ్డి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. రాష్ట్రంలో వైసీపి ప్రభుత్వం వచ్చి మూడేళ్లు పూర్తయినా ఆ హామీ నెరవేర్చలేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ఉద్యోగులకు కనీసం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. జీతాలు సకాలంలో రాక ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. రాష్ట్ర ప్రజలంతా పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, జనసేన పార్టీ అధికారంలోకి రాగానే సిపిఎస్ ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు.
