Clock Of Nellore ( Nellore ) – కోనసీమ జిల్లా పేరు విషయంపై అమలాపురంలో నిన్న చెలరేగిన అల్లర్లకు అధికార వైసీపినే కారణమని నెల్లూరు సిటీ జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆరోపించారు. కోనసీమ జిల్లాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టడాన్ని తాము స్వాగతిస్తున్నామని, గతంలో కొత్త జిల్లాలకు పేర్లు పెట్టినప్పుడు పెట్టకుండా ఇప్పుడు పేరును మార్పు చేయడంలో మతలబు ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఖరి కారణంగా అల్లర్లు చెలరేగాయని ఆరోపించారు. పవనన్న ప్రజాబాట పేరుతో నెల్లూరు నగరంలో గడప గడపకూ పాదయాత్ర చేస్తున్న కేతంరెడ్డి ప్రభుత్వ వైఖరిని తీవ్ర స్థాయిలో తప్పుబట్టారు. వైసీపి కనుసన్నల్లోనే అల్లర్లు జరిగాయన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందేందుకే వైసీపి ప్రయత్నం చేస్తుందని, ప్రజలు సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. మంత్రి ఇంటికి నిప్పు పెడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పరిస్థితులను చక్కదిద్దాల్సిన హోం మంత్రి తమ బాధ్యతలను విస్మరించి జనసేనపై ఆరోపణలు చేయడం దౌర్భాగ్యమన్నారు. నెల్లూరు మైపాడురోడ్డులోని పుట్ట సెంటర్, మధురానగర్ లో ఇంటింటికి వెళ్లిన కేతంరెడ్డి వినోద్ రెడ్డి జన పార్టీని ఆదరించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఆత్మకూరు ఇంఛార్జ్ నలిశెట్టి శ్రీధర్, చింతంరెడ్డి శిరీషా రెడ్డి, షేక్ ఆలియా తదితరులు పాల్గొన్నారు.
