సమస్యల పరిష్కారం కోసమే గడప గడపకు మన ప్రభుత్వం : ఆనం వెల్లడి

Clock Of Nellore ( Kaluwai ) – రైతు ప్రయోజనాలే పరమావధిగా, ప్రజలకు మేలు చేసే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ, ఇంకా ఏవైనా అవసరాలు ఉన్నాయో తెలుసుకునేందుకు చేసే ప్రయత్నమే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. గురువారం వెంకటగిరి నియోజకవర్గంలోని కలువాయి మండలం వెరుబోట్లపల్లి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంను లాంఛనంగా ప్రారంభించారు. తొలుత వెరుబోట్లపల్లి గ్రామంలో 40 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ సచివాలయ నూతన భవనాన్ని, 22 లక్షల వ్యయంతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం భవనాన్ని, 17 లక్షల వ్యయంతో నిర్మించిన వై యస్ ఆర్ హెల్త్ క్లినిక్ లను జడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మతో కలిసి ఆనం రామ నారాయణ రెడ్డి ప్రారంభించారు.

అనంతరం నూతన గ్రామ సచివాలయంలో సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలన్నారు. గతంలో ఏపని కావాలన్నా స్థానిక నాయకుల మీద ఆధారపడాల్సి వచ్చేదన్నారు. ప్రస్తుతం ప్రజలకు అవసరమైన అన్ని రకాల సేవలను నేరుగా తమ సమీపంలోని సచివాలయంలోనే అందిస్తున్నామన్నారు. ఆతర్వాత రైతు భరోసా కేంద్రంలో రైతులతో ముఖాముఖి సమావేశమయ్యారు. ఆర్ బి కె ల ద్వారా అందిస్తున్న సేవలను రైతులందరూ సద్వినియోగం తీసుకోవాలని సూచించారు. తదుపరి డ్వాక్రా మహిళలతో సమావేశమయ్యారు.

అనంతరం జరిగిన ప్రజా దర్బార్ లో వెరుబోట్లపల్లి గ్రామంలో ఇప్పటివరకూ అమలు చేసిన సంక్షేమ పథకాలు, వాటి లబ్ధిదారుల సంఖ్యను, వారు పొందిన మొత్తమును అంకెలతో సహా వివరించారు. రైతుల కోసం ఈ ప్రభుత్వం ఎన్నో మంచి కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. ముఖ్యంగా రైతు భరోసా కేంద్రాలలో విత్తనం నుండి అమ్మకం వరకు రైతులకు కావలసిన అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మూగజీవాలకు అంబులెన్సులను ఏర్పాటు చేసిన ఏకైక ప్రభుత్వం తమదన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున పశువుల అంబులెన్స్ లను రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజే లాంఛనంగా ప్రారంభించారని, పశువులకు కావలసిన 35 రకాల పరీక్షలు చేసేందుకు వీలుగా ఈ అంబులెన్సులో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆ తర్వాత గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ప్రజలతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఏ పిడి సాంబశివ రెడ్డి , డి యం హెచ్ ఓ డా. పెంచలయ్య, మార్కేటింగ్ ఏడీ రామమ్మ, వెరుబోట్లపల్లి సర్పంచ్ వెంకట రమణమ్మ, కలువాయి మండల అధికారులు , సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గోన్నారు.

Read Previous

త్వరితగతిన పట్టణ ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు – కమిషనర్ జాహ్నవి

Read Next

సురేష్ రెడ్డి బీహార్ లో గన్ కొన్నాడు… ఒకర్ని అరెస్ట్ చేశామన్న ఏఎస్పీ చౌడేశ్వరి

Leave a Reply

Your email address will not be published.