Clock Of Nellore ( Narukuru ) – సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరులో కాక కడపలో కలుపుతారా అని ప్రశ్నించిన టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా సర్వేపల్లిని తిరుపతి పార్లమెంటులో కలిపే సందర్భంలో అప్పుడేం చేస్తున్నావని ప్రశ్నించారు. ఓటమే ఎరుగని నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డితో గెలుపే తెలియని నీకు పోలికేంటని ఎద్దేవా చేశారు. సర్వేపల్లిని నెల్లూరుజిల్లాలోనే కొనసాగించినందుకు కృతజ్ఞతగా కాకాణి గోవర్ధన్ రెడ్డి తోటపల్లి గూడూరు మండలం, నరుకూరులో మహిళలతో కలిసి ఆదివారం భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీకి ప్లకార్డులు చేతబట్టి మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం కాకాణి మాట్లాడుతూ నెల్లూరు నగరానికి ఆనుకుని ఉండే సర్వేపల్లి నియోజకవర్గాన్ని బాలాజీ జిల్లాలో కలిపి ఉంటే ప్రజలు చాలా ఇబ్బందులు పడేవారన్నారు. ఇదే విషయాన్ని తాను సిఎంకు చెప్పగా ఆయన అంగీకరించి నియోజకవర్గాన్ని నెల్లూరుజిల్లాలోనే కొనసాగించారని, నియోజకవర్గ ప్రజలంతా సిఎంకు రుణపడి ఉంటారని చెప్పారు. నియోజకవర్గంలో ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి సిఎంకు ధన్యవాదాలు తెలియజేస్తుంటే జీర్ణించుకోలేని చంద్రమోహన్ రెడ్డి తన అక్రోషాన్ని వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు.


